3, నవంబర్ 2013, ఆదివారం

నేను నాదేశం

నాకు ఉదయాన వార్తాపత్రికలు వద్దు
ప్రతినిమిషం పలకరించే చానెళ్ళు వద్దు
నాలో పెరుగుతున్న భయాన్ని ఆపాలి
దేశమంటే నాకున్న భయాన్ని ఆపాలి

ఉద్యానవనాన ఉషోదయపు నడకలు వద్దు
సంధ్యా సమయాన ఆనంద వాహ్యాళివద్దు
ఎప్పటికీ ఈ గృహనిర్బంధం వీడొద్దు
నన్ను నా దేశం భయపెడుతుంది
విద్వేష సమూహాల విశృంఖల పద ఘట్టనల
నా గుండెల్లో ప్రతిక్షణం ప్రతిధ్వనిస్తున్నాయి

"అమ్మా ! భరతమాత స్వేచ్చా స్వాంతంత్ర్యాలు
ఏవమ్మా ! " ఆని ఆశ్చర్యపడే భావి భారత పౌరులకు
నా భయంతో సమాధానం చెప్తాను, అవి నాతో పాటు
స్వచ్చందంగా చెరసాలలో మగ్గుతున్నాయని ,
ఊపిరి తీసుకోనేందుకు భయపడుతున్నాయని.

ఎవరికో క్రోధం, మరెవరికో ఉన్మాదం
మరొకరికి ఉక్రోషం, ఆక్రోశం, దారిద్ర్యం
ఏదైతేనేం రక్తపు నెగళ్ళు రగిలిస్తున్న సమాజం
భయపడి ,బిక్కుమంటున్న నేను, నా దేశం

నా కణతల మీద పెట్టిన ఈ తుపాకీ
లో మందుగుండు ఎప్పటికి పూర్తవుతుంది
నా దేశంలో పుట్టిన ఈ విబేధాల
కుంపటి ఎప్పటికీ చల్లారుతుంది
హిమాలయాలు కరుగుతున్నా
క్రోధం కరగటం లేదు
సముద్రాలు పెరుగుతున్నా
మానవత్వం పెరగటం లేదు

నీలాకాశాలు, నల్లటి నేలలు
పచ్చటి పైరులు, తెల్లటి నదులు
అన్నిటికి రంగు మార్చి
ఎర్రటి నెత్తురు పులుముతున్న
ముష్కర మూక అగడం ఎప్పటికీ అగుతుంది
ప్రేమలు,అనురాగాలు, అప్యాయతలు
అనందాలు, అన్నిటిని హతమారుస్తున్న
ఈ స్వార్ద శక్తుల కుట్ర ఎప్పటికీ ఆగుతుంది

వార్తాపత్రికల్లో  ఆనందాన్ని ఎప్పుడు చూడాలి
ప్రతినిమషం వార్తల్లో చిరునవ్వులు ఎప్పుడు చూడాలి
నా భయాన్ని నేను ఎప్పుడు పోగొట్టుకోవాలి
అసలు నేను నా దేశాన్ని ఎప్పుడు ప్రేమించాలి ??

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి