22, జూన్ 2013, శనివారం

రుద్రభూమి

ప్రజలు ప్రకృతి ని నాశనం చేశారని
కన్నెర్ర  చేశావా పరమేశా
మూడో కన్ను తెరిచావా
అగ్నికీలల బదులుగా
వర్షకీలలు గా కురిశావా
అగ్నికీలలై అశరీరలైతే
నీ విలయాన్ని
గమనించలేమని
ఇంత పని చేశావా
ప్రళయ రుద్రా
చల్లబడిందా మూడో కన్ను
తప్పెవరు చేశారయ్యా
శిక్షెవరికయ్యా
భోళా శంకరయ్యా
బూడిదిచ్చేవాడివని తెలుసు కాని
బ్రతుకే నీటి బుగ్గిపాలు చేశావు కదయ్యా
శివయ్యా
కళేబరాలు మోస్తావని తెలుసు
కాని ఇన్ని కళేబరాలు అనుకోలేదయ్యా
పరమశివయ్యా
చితాభస్మం పూసుకుంటావని తెలుసు
కాని తల్లుల కుంకుమ పూసుకుంటావనుకోలేదయ్యా
జంగమయ్యా
స్మశానం లో తిరుగుతావని తెలుసు
కాని దేశాన్నే స్మశానం చేస్తావనుకోలేదయ్యా
రుద్రయ్యా
హాలాహాలం తాగుతావని తెలుసు
ఇంతమందిని జలంలో ముంచుతావనుకోలేదయ్యా
నీలకంఠయ్యా
అందరికీ దిక్కే నువ్వు కదయ్యా
ఇప్పుడు దిక్కొక్కరిని చేశావు కదయ్యా
దిగంబరయ్యా


అమ్మా ! తల్లి గంగమ్మా
తరతరాలుగా నువ్వే
కదమ్మా మా భరత జాతిమాతవి
నీ బిడ్డలనే నువ్వు బలికోరావా అమ్మా
అవునులే అమ్మా ! 

కన్న బిడ్డలను స్వయంగా చంపటం
నీకు భారతకాలం నుండి అలవాటేగా 
ఇప్పుడు అడ్డు చెప్పే శంతనవులు కూడా లేరు
బ్రతికి బట్టకట్టే భీష్ములు లేరు, 
ఉన్నదంతా  మాములు మనుషులే

అమ్మా పార్వతి మాతా
అమ్మలగన్న అమ్మవి

ముగ్గురమ్మల మూలపుటమ్మవి
అంటే నీకు ప్రేమ మూడింతలు ఉండాలి కదమ్మా
ఎందుకమ్మా, మామీద కక్ష
పుణ్యమే చేశామో, పాపమే చేశామో
నిన్ను చూసినంతనే పాపాలు తొలుగుతాయంటారే
నువ్వేంటమ్మా ప్రాణాలు తొలిగించావు
మట్టి బొమ్మ కు ప్రాణం పోతేనే తట్టుకోలేకపోయావే
ఇప్పుడు ఇంతమందిని మట్టికింద వేసి చంపావు కదమ్మా

ఇప్పుడెవరికి చెప్పుకోవాలి కష్టం
అమ్మా, నాన్న లే చిదిమేస్తే  ప్రాణం






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి